New Energy Policy in State : రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో రూ. 10లక్షల కోట్ల పెట్టుబడులు, 7.75 లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా ‘సమీకృత ఇంధన పాలసీ’ని ప్రభుత్వం రూపొందించింది. సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, ఎలక్ట్రోలైజర్స్, బయో ఫ్యూయల్, పీఎస్పీ, హైబ్రిడ్ ప్రాజెక్టులు సోలార్ పార్కులు, తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఒకే పాలసీని తీసుకొస్తోంది. ఈ పాలసీ ద్వారా వచ్చే పెట్టుబడులకు పారిశ్రామిక హోదాను కల్పించనుంది. ప్రధానంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహించడం ద్వారా అంతర్జాతీయ పెట్టుబడుల లక్ష్యంగా ప్రభుత్వం పాలసీని రూపొందించింది. పునరుత్పాదక తయారీ జోన్లను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం 500 విద్యుత్ ఛార్జింగ్ కేంద్రాలను సైతం నెలకొల్పనుంది.