అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి

2024-08-17 2

Telangana Student Died in America : అగ్ర రాజ్యం అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ యువకుడు హనుమకొండకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుమారుడు చనిపోయాడంటూ సమాచారం రావడంతో తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కనీసం మృతదేహాన్ని అయినా తెప్పించండంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, హనుమకొండ జిల్లా ఆత్మకూరుకు చెందిన ఏరుకొండ రాజేశ్​ 2016లో అమెరికాకు వెళ్లాడు. అక్కడ ఎమ్మెస్​ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. మధ్యలో రెండుసార్లు స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. గత సంవత్సరం తండ్రి చనిపోయినా అంత్యక్రియలకు రాలేకపోయాడు. తండ్రి సంవత్సరికానికి వస్తానని చెప్పాడు. కానీ ఇంతలోనే అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. రాజేశ్​ చనిపోయాడంటూ సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎక్కడకు పోయావురా కొడుకా అంటూ ఫొటో పట్టుకుని ఆ తల్లి ఏడవడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.