దొంగతనానికి పాల్పడే దొంగలు ఎంత జాగ్రత్తగా ఉంటారు. అమ్మో తమల్ని ఎవరైనా గమనిస్తురా.. చుట్టూ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా.. నక్కి, నక్కి ఎవరూ చూడకుండా ఇంట్లోకి ఎలా వెళ్లాలో స్కెచ్ వేస్తూ అలర్ట్ అవుతుంటారు. .త్వరగా పని ముగించేసుకుని అక్కడి నుంచి బయటపడాలి అనుకుంటుంటారు. కానీ ఢిల్లీలో ఓ దొంగ వేసిన చిందులు చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. దుకాణాన్ని దొంగలిద్దామని వచ్చిన ఓ దొంగ... దొంగతనానికి ముందు ఇక తమ పని నెరవేరబోతుందనుకుంటూ.. సంబురంలో మునిగి తేలిపోయాడు. తన పార్టనర్తో కలిసి డ్యాన్స్లతో అదరగొట్టాడు. దుకాణం షట్టర్ తాళం బద్దలు కొట్టడానికి ముందు ఈ దొంగ ఎంత సంతోషంగా ఉన్నాడో, ఈ వీడియోను చూస్తేనే అర్థమవుతుంది.
ఢిల్లీలో ఈ వీడియో బయటపడింది.ఈ ప్రాంతమంతా నిఘాలో ఉందని గుర్తించిన అనంతరమే సీసీటీవీ యజమానిని టీజ్ చేసేందుకు ఆ దొంగ అలా చేశాడని తెలిసింది. ఇరవై రెండు సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ అనంతరం దుకాణం షట్టర్ను తెరవడానికి ఈ ఇద్దరు దొంగలు పడ్డ కష్టమంతా సీసీటీవీలో రికార్డైంది. అయితే ఆ చోరి విజయవంతంగా ముగించుకున్నారా? లేదా? అన్నదే మిస్టరీ. దుకాణం షట్టర్ తెరిచే విధానం వరకే సీసీటీవీ వీడియో రికార్డైంది. మిగతాది ఇంకా ఏమైందో తెలియరాలేదు.