Chandrababu Lashed Out At Jaitley Over His Statement

2018-02-07 1,067

Andhra Pradesh CM Nara Chandrababu Naidu lashed out at Union Minister Arun Jaitley over his statement in parliament.

తెలుగుదేశం పార్టీ ఎంపీలతో ఏపీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో కేవలం ప్రకటనతో సరిపోదని, నిర్దిష్ట కాలపరిమితి ఉండాల్సిందే అన్నారు.
ఆర్థిక లోటుపై ఇంకేం క్లారిటీ కావాలంటూ సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజనకు లేని విధివిధానాలు న్యాయం చేయడానికి కావాలా అని నిలదీశారు. నాబార్డు నిధుల గురించి ప్రస్తావించిన జైట్లీ మిగతావి వదిలేయడం ఏమాత్రం సరికాదన్నారు. 5 కోట్ల మందికి అన్యాయం జరిగిందన్నారు.
టీడీపీ ఎంపీలతో జరిగిన టెలి కాన్ఫరెన్సులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సమస్యను జాతీయ సమస్యగా మార్చామని వ్యాఖ్యానించారు. నవ్యాంధ్రకు జరిగిన అన్యాయాన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం చేశామని వ్యాఖ్యానించారు. దీనిని హేతుబద్దంగా ముందుకు తీసుకు వెళ్లాలని చెప్పారు.మనకు కేవలం ప్రజాప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని చంద్రబాబు అన్నారు. సభ నుంచి మనలను సస్పెండ్ చేసే పరిస్థితి ఉన్నా వెనుకంజ వేయవద్దని సూచించారు. విభజన సమయంలో ఇచ్చిన అన్ని హామీలకు కేంద్రం కట్టుబడి ఉండాలని, సమయం కూడా చెప్పాలన్నారు.
ఆర్థిక భర్తీ లోటుకు కొత్త ఫార్ములా కావాలన్న జైట్లీ వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన విషయంలో లేని ఫార్ములా, ఏపీని ఆదుకోవడంలో కావాలా అని నిలదీశారు. విభజనను అన్యాయంగా చేశారన్నారు. ఏపీ విభజన సమస్యలపై పార్లమెంటులో ప్రత్యేకంగా రెండు గంటల పాటు చర్చించాల్సిందేనని చంద్రబాబు ఎంపీలకు సూచించారు. అప్పటి వరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. ఏ పార్టీ అయినా ప్రజాభిప్రాయం మేరకే నడుచుకోవాలని చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీలపై నిర్దిష్ట కాలపరిమితి చెప్పే వరకు ఆందోళన కొనసాగించాలన్నారు.