Polavaram Project: Centre Orders AP Govt To Stop Calling Tenders

2017-11-30 790

Union water resources ministry has asked Andhra Pradesh CM Nara Chandrababu Naidu government to stop Polavaram project works.

పోలవరం ప్రాజెక్టు పనులపై కేంద్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భారీ షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే ఆయన ఆలోచనకు బ్రేక్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌లో కొంత భాగానికి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన టెండర్లను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించింది. ఈమేరకు కేంద్ర జల వనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 27న లేఖ రాసింది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో జాతీయ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) అధ్యయనం చేసేంత వరకు పనులు నిలిపేయాలని కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చాయి.
ఎన్‌హెచ్‌పీసీ ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులపై అధ్యయనం చేసేందుకు పోలవరం ప్రాజెక్టు వద్దకు ఇప్పటి వరకు కూడా రాలేదు. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులపై జలవనరుల శాఖ ఇప్పటికే ఆందోళన చెందుతోంది. ఇప్పుడు స్పిల్‌ వే, చానల్‌ టెండర్లను నిలిపివేయాలని కేంద్రం ఇంకో షాక్ ఇచ్చింది. చంద్రబాబుకు ఇది ఊహించని దెబ్బగానే భావించాల్సి ఉంటుంది.కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీతో ఈ ఏడాది అక్టోబరు 13న నాగపూర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం భేటీ అయింది. పోలవరం కాంక్రీట్‌ పనులు లక్ష్యం మేరకు జరగడం లేదని, 2018కి గ్రావిటీ ద్వారా 2019కి సంపూర్ణంగా ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యంతో స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌లో కొంత భాగానికి టెండర్లు పిలుస్తామని చంద్రబాబు ఈ సమావేశంలో వివరించారు.