In 30 assembly segments more than 2 aspirants for TRS tickets in 2019 Assembly elections
ఇతర పార్టీల నుండి వలసలు పెరగడంతో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికీ టిక్కెట్లు దక్కుతాయోననే ఆందోళన టిఆర్ఎస్ నేతల్లో నెలకొంది. రాష్ట్రంలోని సుమారు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిక్కెట్ల కోసం నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ పోటీ నేపథ్యంలో ఎవరికీ టిక్కెట్టు దక్కనుందోననే అర్ధం కాని పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఇతర పార్టీల్లో బలమైన నేతలతో పాటు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా టిక్కెట్లను కేటాయించాలని టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ భావిస్తున్నారు.
అయితే ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై కెసిఆర్ పలు దఫాలు సర్వేలు నిర్వహించారు. ఆ సర్వే నివేదికలను పార్టీ ఎమ్మెల్యేలకు అందించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా టిక్కెట్లను కేటాయించాలని కెసిఆర్ యోచిస్తున్నారు.
ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేసేందుకుగాను టిఆర్ఎస్ ఆయా పార్టీల్లోని ముఖ్య నేతలను, ఎమ్మెల్యేలను టిఆర్ఎస్లోకి ఆహ్వనించారు. అయితే ఇప్పుడు ఇదే టిఆర్ఎస్కు తలనొప్పిగా మారనుంది. ఎన్నికల సమయంలో టిక్కెట్ల కేటాయింపులో బహు నాయకత్వం గులాబీ బాస్కు ఇబ్బందులు తెచ్చి పెట్టనుంది. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ మంది టిక్కెట్ల కోసం పోటీ పడుతుండడంతో ఇబ్బందులు తప్పేలా లేవంటున్నారు విశ్లేషకులు.అయితే పనితీరు ఆధారంగానే టిక్కెట్లను కేటాయించాలని కెసిఆర్ భావిస్తున్నారు. అయితే టిక్కెట్లు దక్కని నేతలు ఎన్నికల సమయంలో ఏ రకంగా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారనుంది.